Impartial Judgement
నిష్పక్ష తీర్పు
ఉషా యస్ డానీ
కలియుగం కనుక ధర్మం ఒంటికాలి మీద సడుస్తోందట.
ఈ మధ్య హైదరాబాద్లో రోడ్దుదాటుతుంటే ఓ కారుగుద్ది, ఆ ఒంటికాలు కూడా కుంటిదైపోయిందని చూసినవాళ్ళు చెపుతున్నారు. అయినా ధర్మం గురించి మహానగరాల్లో మాట్లాడుకోవడం సమంజసం కాదుకనుక మనం ఇతర విషయాల వైపు మళ్ళితే బాగుంటుంది.
ఆ మధ్య, ఆకలితో నకనకలాడిపోతున్న కుర్రాడొకడు ఆమీర్ పేట సెంటర్లో రోడ్దుపక్క పునుగులు తిని, డబ్బులు ఇవ్వకుండా పారిపోయాడు. సైబరాబాద్ ఒబేసిటీ రన్ లో పాల్గొని వస్తున్న మెరికల్లాంటి కార్పోరేట్ కాలేజీ కుర్రాళ్ళు ఓ నలుగురు అప్పుడే అక్కడికి వచ్చారు. వాళ్ళు, బహు సాహసోపేతంగా పరుగులు తీసి, ఆ పునుగుల దొంగను పట్టుకుని, నాలుగు తన్ని, ఈడ్చుకువచ్చి, పునుగుల బండివాడికి అప్పచెప్పారు.
అప్పుడే
అక్కడే ఓ విచిత్రం జరిగింది.
పునుగుల బండివాడు ఆ పునుగుల దొంగను తనివితీరా తిడతాడనీ, ఆ తరువాత కసితీరా తంతాడనీ అందరూ అనుకున్నారు. కానీ, అతనా పని చెయ్యలేదు. పైగా, ఆ పునుగుల దొంగకు ఇంకో రెండు ప్లేట్లు పునుగులు ఇచ్చి, ఆకలితీరా తినమన్నాడు. ఐదేళ్ల క్రితం తను కూడా ఆకలితోనే మెదక్ జిల్లా నుండి ఇక్కడికి వచ్చి, అలా ఆమిర్ పేటలో స్థిరపడ్డానన్నాడు. పునుగుల దొంగ ఒప్పుకుంటే తన దగ్గర వంట అసిస్టెంటు అనబడే, ప్లేట్లు కడిగే ఉద్యోగం ఇస్తానన్నాడు. ఈ ప్రతిపాదన పునుగుల దొంగకు కూడా నచ్చింది. వెంటనే కొలువులో చేరిపోయాడు. వాళ్ళిద్దరూ ఆ గొడవని అలా శాంతియుతంగా పరిష్కారం చేసుకున్నారు.
స్కాములు, స్వాములూ, సానులు తప్ప మరోవార్త కవర్ చేయడానికి ఈమధ్య అంతగా అవకాశం దొరకని మీడియావాళ్ళు మొత్తం కట్టకట్టుకుని ఈ పునుగుల దొంగ మీద పడ్డారు. పునుగుల బండివాడి ఔదార్యాన్ని వంద కెమేరాలతో, రెండు వందల విశ్లేషణలతో ప్రసారం చేశారు.
ఉదయం సెషన్ కూ మధ్యాహ్నం సెషన్ కూ మధ్య లంచ్ సమయంలో పేషీ టివీలో జీవనశైలి వ్యాధుల మీద ’హల్లో డాక్టర్’ ప్రోగ్రాం చూస్తున్న హైకోర్టు న్యాయమూర్తులవారు ఒకరి దృష్టి ఆ బ్రేకింగ్ న్యూస్ మీద పడింది. పునుగుల దొంగ కథనం విని వారు వెంటనే స్పందించారు.
ధర్మం హైదరాబాద్ రోడ్ల మీద ఒంటికాలితో కుంటుతూ నడుస్తోందిగానీ, హైకోర్టు ఆవరణలో అది నాలుగు కాళ్లతో సంచరిస్తోంది. ధర్మాన్ని ఎవరు ఉల్లంఘించినా సరే వారికి శిక్షపడాల్సిందేనని భావించిన సదరు న్యాయమూర్తులంవారు, దొంగతనం చేసినందుకు పునుగుల దొంగ మీదా, ఒక దొంగకు ఆశ్రయం కల్పించినందుకు పునుగుల బండివాడి మీదా సూమోటోగా కేసులు నమోదు చేయాలని ఆమీర్ పేట పోలీసు స్టేషనుకు తాఖీదు పంపించారు.
హైకోర్టు
ఆదేశాల ప్రకారం ఆమీర్ పేట పోలీసులు హుటాహుటిన రంగంలోనికి దిగి పునుగుల దొంగనూ, దొంగకు ఆష్రయం ఇచ్చిన వాడినీ
అరెస్టు చేసి కోర్టు బోనులో నిలబెట్టారు.
కోర్టుల్లో
కేసుల నడకకు ఒక నియయం వుంటుంది. నిందితులు ధనవంతుడు అయితే ఫైళ్ళు నత్తకన్నా నిదానంగా
నడుస్తాయి. నిందితులు పేదవాళ్ళయితే ఫైళ్ళు
రాకెట్ కన్నా వేగంగా పరుగులు తీస్తాయి.
అలా మొదలైన పునుగుల థెఫ్ట్ కేసు చాలా వేగంగా ముందుకు కదిలి, హైకోర్టు ఫుల్ బెంచి ధర్మాసనం ముందు తీర్పు వరకు వచ్చేసింది.
తీర్పు చెప్పే ముందు, ధర్మాసనంలోని న్యాయమూర్తులందరూ పునీతులవ్వాలనిన్నూ, ఆత్మప్రక్షాళన చేసుకోవాలనిన్నూ, నిష్పక్షపాతంగా తీర్పు చెప్పాలనిన్నూ ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు.
"ఈ యొక్క పునుగుల వ్యాపారంలో మీలో ఎవరికైనా, ఏ విధమైన ఆసక్తిగానీ వుందా?" అని ప్రధాన న్యాయమూర్తి అడిగారు.
"లేదు" అని ధర్మాసనంలోని న్యాయమూర్తులందరూ ముక్తకంఠంతో చెప్పారు.
"మీలో ఎవరైనాగానీ, ప్రైమరీ మార్కెట్లోగానీ, సెకండరీ మార్కెట్లోగానీ, ఈ యొక్క పునుగుల బండి వ్యాపారంలో షేర్లు కొన్నారా?"
"లేదు. లేదు"
"ఈ పునుగుల బండివాడితోగానీ, ఆ పునుగుల దొంగతోగానీ, మీకెవరికైనా బంధుత్వాలుగానీ, స్నేహాలుగానీ, రాగద్వేషాలుగానీ ఏమైనా వున్నాయా?"
"లేదు. లేదు. లేదు".
"మీలో ఎవరైనా ఎప్పుడయినా అటుగా వెళుతూ, ఆ ఆమీర్ పేట సెంటర్లో ఈ యొక్క పునుగుల బండి దగ్గర ఆగి, ఏవైనా తినడంగానీ, తాగడంగానీ చేశారా?"
"లేదు. లేదు. లేదు. లేదు".
ధర్మాసనంలోని న్యాయమూర్తుల సమాధానాలతో ప్రధాన న్యాయమూర్తులవారు సంపూర్తిగా సంతృప్తి చెందారు. వాళ్లను ఇక తీర్పు చెప్పాల్సిందిగా కోరారు.
అప్పుడు ఆ న్యాయమూర్తులందరూ ముక్తకంఠంతో తీర్పు ప్రకటించారు.
పునుగుల బండివాడికీ, పునుగుల దొంగకూ చెరో ఆరేళ్ళ కఠినకారాగార శిక్షను విధించారు. దొంగను
బాహాటంగా ఆశ్రయం ఇచ్చిన తీవ్రమైన నేరం కనుక, స్వాతంత్ర్య దినోత్సవం అనో, గాంధీ జయంతి అనో, జైల్లో నడవడిక బాగుందనో శిక్షలో
ఎలాంటి తగ్గింపు వుండరాదని ప్రత్యేకంగా ఆదేశాలిచ్చారు.
ఆ తరువాత, హైకోర్టు ఆవరణలో ధర్మం దర్జాగా వెయ్యి కాళ్లతో సంచరించడం మొదలెట్టింది.
(కక్షిదారులతో భావబంధాలున్న న్యాయమూర్తులు కేసుల్ని విచారించడం సమంజసం కాదన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగారికి అభినందనలతో)
హైదరాబాద్
11 - 08 - 2011

Comments
Post a Comment