Chavu Neellu
*చావునీళ్ళు*
*ఉషా యస్ డానీ*
దిక్కులేని శవాలకు పేర్లుండవు, వేదాద్రి రేవులో అందరికీ ఆమె శవంగానే తెలుసు.
దిక్కులేని శవాలకు కథలుంటాయి. ఈ శవానికీ ఒక కథుంది. ఈ శవం కథ చాలామందికి తెల్సు. అంటే, వాళ్ళందరికీ ఈ కథ మొత్తంగా తెలుసనీకాదు. ఒక్కొక్కరికీ ఒక్కొక్క ముక్క తెల్సు. తెలిసినవాళ్లంతా ఒకచోట చేరి ఒకరి వెంట ఒకరు ఒక్కో ముక్క చెపితే బావుణ్ణు; దిక్కులేని శవాల గురించి చాలా మందికి చాలా విషయాలు తెలిసేవి. కానీ వాళ్ళు అలా ఒక చోట కూర్చోవడం కుదరదు. కుదిరినా నోరు విప్పి కథ చెప్పడం అంతకన్నా కుదరదు.
ఆమె శవం ఎలాగూ దిక్కులేనిదే. ఆ శవం కథకూ ఇప్పుడు దిక్కు లేకుండాపోయింది.
శవం మీది చీరా జాకెట్టునిబట్టి, బోసి మెడనుబట్టి, బోసి నుదిటినిబట్టి, గిల్టు గాజుల్నిబట్టి ఆమె భర్త ముందేపోయాడని చూసినవాళ్లకు ఇట్టే తెలిసిపోతుంది. ఆమెకు ఆరు పదుల వయస్సు దాటి వుంటుందని కూడా వాళ్ళంతా నిర్ధారించారు.
రేవుకు వెళ్లడానికి ముందు ఆమె గుడికి వెళ్ళింది. గుళ్ళోకి వెళ్ళడానికి ముందు గుడి బయట పూజా సామాగ్రి కొన్నది. పూజా సామాగ్రి అమ్మే ఆమెతో కొద్దిసేపు కబుర్లాడింది. చత్వారం కళ్ళజోడు ఇచ్చి, దాన్ని దాయమని మరీమరీ వేడుకుంది.
వర్షాలు లేక పైన్నుండి నీళ్లు రాక కృష్ణానది ఇసుక ఎడారిలా మారిపోయింది. ఆమె కోసమో, అలాంటివాళ్ల కోసమో రేవులో పెద్ద అఖాతముంది.
నరసింహస్వామికి దండం పెట్టుకుని, రేవులో దిగిందామె. లోతుగావున్న చోటు వెతుక్కుని రెండు మునకలు వేసింది. మూడోసారి మునిగిందిగానీ పైకి తేలలేదు. తేలాలనుకోలేదు.
దగ్గర్లోవున్న జాలర్లు గడవేసి గాలించారు. గట్టుకు చేర్చే లోపునే ఆమె శవమైపోయింది.
దిక్కులేని శవాలకు పంచనామా జరపాలి. శవాన్ని విజయవాడకు పంపి బంధువులు వచ్చేవరకు మార్చురీలో వుంచాలి. నాలుగు రోజులైనా ఎవరూ రాకపోతే, ఆ శవానికి దహన సంస్కారాలు జరపాలి. వీటన్నింటికీ కలిపి నాలుగైదు వేల రూపాయలైనా ఖర్చు అవుతుంది. చిల్లకల్లు పోలీసు స్టేషన్లో అంత బడ్జెటులేదు.
నదిలో శవం తేలిందని పోలీసులకు వార్త వెళ్ళింది. బడ్జెట్టే లేనపుడు శవం దగ్గరికి మాత్రం వెళ్లడం దేనికని పోలీసులు ఊరకుండిపోయారు.
శవం గట్టుమీద ఉండగానే, ఆమె కొడుకులు వచ్చారు. పూజా సామాగ్రి కొట్టులో ’కళ్ళజోడు సందేశా’న్ని సరిగ్గానే అందుకున్నారు. శవాన్ని తీసుకెళ్ళే శక్తి వాళ్లకులేదు. తల్లికి అంతిమ సంస్కారాలు జరిపే స్తోమత అంతకన్నాలేదు. దినం చేసే దిక్కేవుంటే ఆమె దిక్కులేనిచావు ఎందుకు చస్తుందీ?
ఆ శవం మాదికాదంటే మాదికాదంటూ వచ్చినంత వేగంగా వెళ్ళిపోయారు ఆమె కొడుకులు.
గుడి దగ్గర శవాన్ని ఎక్కువసేపు వుంచడం మంచిదికాదని అయ్యవార్లు భావించారు. ఊరి మాజీ సర్పంచ్ ఆర్ధిక సహాయంతో శవానికి అంతిమ సంస్కారం జరిపించారు. ఇటీవలికాలంలో వేదాద్రిలో ఇది నాలుగో శవం.
ఈ శవం కథలో ఇంకో ముక్క మిగిలిపోయింది. అది ఒకరు చెప్పేదీ కాదు. జగ్గయ్యపేట కరువుప్రాంతంలో ఆ ముక్క గాల్లో పచార్లు చేస్తోంది. గాలి భాషను పట్టుకునేవాళ్ళకు కథలో మిగిలిన ముక్కలు
తెలుస్తాయి.
ఆ శవానిది చిల్లకల్లు సమీపాన చిన్నగ్రామం. యాదవ కుటుంబం. కొడుకులతోపాటూ కోడళ్ళూ, మనవళ్ళూ వున్నారు. ఎకరం మాగాణి. ఎకరం మెట్ట. పది జీవాలు. వాటికి సరిపడా బ్యాంకు అప్పు. వెరసి వాళ్ల బతుకు.
పొలం పనుల్ని కొడుకులు చూసుకుంటుంటే, జీవాల్ని ఆమె మేపుకొచ్చేది.
కరువొచ్చి మాగాణి బీడైపోయింది. మెట్టలో మిర్చి వేస్తే నీరులేక చేను ఎండిపోయింది. కిలో గడ్డి మూడు రూపాయలకు మించిపోయింది. జీవనాధారంగావున్న జీవాలను కోదాడ సంతకు తోలెయ్యక తప్పలేదు. పిల్లలకు పూటకింత అన్నం పెట్టలేని రోజుల్లో తల్లికింత ముద్ద పెట్టడం కొడుకులకు తలకు మించిన పనైంది.
ఆ కుటుంబానికీ, ఈ ప్రపంచానికీ ఆమెతో పనిలేకుండా పోయింది. ఆకలి, అవమానాలతో కొన్నాళ్ళు బతికింది.
ఛస్తే చావునీళ్ళకు కూడా నోచుకోనని ఆమెకు తెలిసిపోయింది. కరువు చావుకన్నా, వేదాద్రి వెళ్ళి కృష్ణలో మునిగి చావడం మేలనుకుంది.
బతకాలనుకున్న చోట ఆమె బతకలేక పోయింది. చావాలనుకున్న చోట ఆమె చనిపోయింది.
విజయవాడ
1 మార్చ్ 2003
ప్రచురణ : ఆంధ్రభూమి దినపత్రిక
2 మార్చ్ 2003

Comments
Post a Comment